సాళంగనాట
తమ సత్వ మెఱిఁగియు దాఁచిరి గాకా
తము నేలే రాము స్వతంత్రము చూపవలసి IIపల్లవిII
హనుమంతుని తోఁక నసురులందరుఁ గూడి
మును లంకలో నగ్ని ముట్టించే వేళను
అనలము శీతో భవ యన నేరిచిన సీత
పనివి రావణ హతో భవ యన నేరదా IIతమII
అంకెల జలధి దాఁటి యట రాముని ముద్రిక
సంకె లేక చేతఁ బట్టి సాహసమునా
లంకాధిదేవతయైన లంకిణిఁ గొట్టినవాఁడు
వుంకించి రావణుఁ జంప నోపఁడా వాయుజుఁడు IIతమII
శ్రీవేంకటేశుఁడైన శ్రీరాఘవుని పంపున
వావిరి నంగదముఖ్య వానరులెల్లా
ఆవేళ హేమపాత్ర లగ్నిలో వేసినవారు
రావణునందులో వేసి రా నోపరా IIతమII 15-263
ఈ కీర్తన 27 వ తారీఖున నేను శ్రీ అన్నమాచార్యుల శృంగార కీర్తనల లోనిదిగా పొరబడి
వ్రాయ మొదలు పెట్టా.నేను పడిన పొరపాటు సరిదిద్దటం కోసమేమో అన్నట్టుగా కరంటు
పోవటం, బ్లాగు పూర్తికాకపోవటం జరిగింది.
విహారి గారూ నన్ను క్షమించాలి.ఈ రోజు ఆలస్యంగా అయినా పూర్తి చేస్తున్నాను.
ఇది శ్రీ అన్నమయ్య కుమారుడైన పెద తిరుమలాచార్యుల నారి ఆధ్యాత్మిక సంకీర్తన.
నాకు అర్ధం తెలియని పదబంధాలు:
పనివి
అంకెల
సంకె
వావిరి
తరువాత ఈ బంగారు పాత్రలు అగ్నిలో వేసిన కధ రామాయణం లో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో
నాకు తెలియదు.ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోరూ---
దీనిలో సీత,హనుమంతుడు,అంగదుడు మొదలైనవారంతా రాముని గొప్పతనం లోకానికి తెలియాలని
ఉద్దేశించి మాత్రమే వారా పనులను చేయకుండా వదిలిపెట్టారట! కాని వాళ్ళంతా ఆ పనులు చేయగల సమర్ధత
గలనారేనట!తాళ్ళపాక కవుల సంకీర్తనలు ఒక్కోటీ ఒక్కో అణిముత్యమే.అవి చదవటానికి,వ్రాయటానికి,పాడుకోవటానికి అత్యంత
ఆనందదాయకాలు.