నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

May 5, 2014

మిమ్మల్ని మీరే గెలిపించుకోండి.



ఎవర్నో గెలిపించటం కాదు . మిమ్మల్ని మీరేగెలిపించుకోండి! ఆ అవకాశం ఇపుడు మీ ముంగిట్లోకి వచ్చి మీ తలుపు తడుతోంది ! మన మంతా సామాన్యులం. మనం ఇపుడు మనల్ని మనమే గెలిపించుకొని, అసామాన్యులుగా మనల్ని మనం నిరూపించుకొందాం. ఇదే మనకు తగిన చివరి అవకాశం. ఎల్లుండి 7వ తారీఖున జరగబోయే ఎన్నికలే అందుకు మనకు సరియైన వేదిక.
మన ఢిల్లీ సోదరులు గత అసెంబ్లీ ఎన్నికలలో వారి వోటును వారికే వేసుకొని 28 మంది సభ్యులను మాత్రం గెలిపించుకొని అసెంబ్లీకి వారి తరఫున పంపించుకొన్నారు. వారు అధికారాన్ని చేపట్టటానికి తగిన సంఖ్యాబలం లేనందున అధికారం చేపట్టటానికి మొదటగా సిద్ధపడలేదు. కాని, వారి కంటే అధిక సభ్యులున్న బి.జె.పి.వారు కూడా అధికారాన్ని స్వీకరించటానికి విముఖత చూపించటం వల్లనైతేనేమి, అత్యల్ప సభ్యులు కలిగిన కాంగ్రెస్ వారు ఆమ్ ఆద్మీ పార్టీ వారు అడగకపోయినప్పటికీ సంపూర్ణ మద్దతును అందించుతామని గవర్నరుగారికి లేఖ ద్వారా తెలియజేయటం వల్లనైతేనేమి, ఢిల్లీవాసులు అరవింద్ కేజ్రీవాల్ గారిని అధికారం చేపట్టమని కోరటం వల్లనైతేనేమి వారు ముందుకు వచ్చి అధికారం చేపట్టటం జరిగింది. 

కాని ఆ పరిపాలన కేవలం 49 రోజులు మాత్రమే ఉనికిలో ఉండి కేజ్రీవాల్ గారి రాజీనామా వల్ల అక్కడ ప్రభుత్వం లేకుండా పోయింది.

ఆ 49 రోజులలోనూ వారు చేయగలిగినంత మంచిని చేసి పరిపాలన అంటే ఎలాఉండాలో చూపించారు. వారు ఆ 49 రోజులలోను సాధించిన విజయాలలో, ముఖ్యమైనవి పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, దిగువ,మధ్య తరగతి వినియోగదారులకు వారి విద్యుత్ రేట్లలో సగానికి సగం కుదింపు, ఆ పార్టీ ప్రథాన ఎజెండా అయిన అవినీతి నిర్మూలనలో గణనీయమైన ప్రగతిని సాధించటం( స్వతంత్ర్య వార్తా ఛానళ్ళ వార్తల వల్ల తెలిసిన విషయం), పిల్లలకు స్కూళ్ళలో డొనేషన్లు లేకుండా అనుమతులను సాధించటం వంటివి మనం చూశాం, విన్నాం. ఆ 49 రోజుల్లో వారు సాధించినన్ని విజయాలని మరే ఇతర రాజకీయ పార్టీలవారూ కూడా స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని నాళ్ళ పరిపాలనలో అంత తక్కువ సమయంలో కూడా సాధించలేకపోయింది.
ఆ 49 రోజులలోనే ప్రభుత్వాధికారులు లంచాలు తీసుకోవటానికి భయపడేంతగా మార్పు వచ్చిందనీ, రోడ్డు ట్రాన్సుపోర్టు ఆఫీసులలోనైతే లంచాలు ఇవ్వనక్కరలేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజల పనులు జరిగిపోతున్నాయనికూడా మనం వినటం జరిగింది. మన దేశ సహజ వనరులను తమ గుప్పిటిలో ఉంచుకొని అత్యధికమైన ప్రపంచవ్యాప్త ఖరీదుతో మన వనరులను మనకే అమ్మి అత్యధిక లాభాలను మూటగట్టుకుంటున్న రిలయన్స్ ముఖేష్ అంబానీ మీద ఫస్ట్ ఇన్ఫర్మేషను రిపోర్టును దాఖలు చేయించి కేసుని నడిపించే సాహసాన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ గారి నాయకత్వంలో చూపించి ప్రజల మన్ననలను అందుకొంది.
మన దేశంలో అవినీతి నిర్మూలనకు బద్ధకంకంణాన్ని కట్టుకొన్న ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి నిర్మూలనలో ప్రజాభాగస్వామ్యం కొఱకు ఉద్దేశించిన జన లోక్ పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అంబానీల కనుసైగలలో పనిచేస్తున్న కాంగ్రెస్, బీ.జె.పి. పార్టీలవారిరువురు ఆమ్ ఆద్మీకి తమ తమ మద్దతును ఉపసంహరించటం ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. నీతివంతమైన మార్గం లోనే తమ పరిపాలనను సాగించదలచిన కేజ్రీవాల్ గారు తమ పదవిని తృణప్రాియంగా ఎంచి రాజీనామా చేసారు. 

గతంలో ఒకే ఒక రైలు ఏక్సిడెంటు జరిగినప్పుడు దానికి తాను నైతిక బాధ్యత వహిస్తూ తమ మంత్రిపదవికి రాజీనామా సమర్పించిన కీ.శే. లాల్ బహదూర్ శాస్త్రిగారి మార్గంలో తిరిగి నీతిమంతమైన రాజకీయానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనే సదుద్దేశ్యంతో సమర్పించిన రాజీనామాను బాధ్యతల నుండి భయంతో పారిపోతున్నట్లుగా చిత్రించి మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. 

తాను బాధ్యతల నుండి ఎక్కడకూ పారిపోవటం లేదనీ ప్రజలు కోరితే దేశంలో అవినీతిని నిర్మూలించి చూపెట్టాలనే సదుద్దేశ్యంతో 434 పార్లమెంటు నియోజక వర్గాల్లోనూ, కొన్ని కొన్నిరాష్టాలలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ కూడా ఆమ్ ఆద్మీలను పోటీకి దించి ఎలక్షన్లలో మన ఆమ్ ఆద్మీలను మనతరఫున పార్లమెంటు సభ్యులుగాను, అసెంబ్లీ సభ్యులుగానూ ఎన్నుకొనే అవకాశాన్ని మనకు కలిగించారు.
జన లోక్ పాల్ బిల్లు ఢిల్లీలో పాస్ కాలేకపోవటానికి కారణాలు 1) ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీవాసులు పూర్తి మెజారిటీని గత ఎన్నికలలో ఇవ్వకపోవటం, 2)అధికమెజారిటీని కలిగిన బి.జె.పి. వారు వారి బాధ్యతను నిర్వహించకుండా ప్రక్కకు తప్పుకోవటం, 3) తమ బేషరతు మద్దతును అంబానీవారి డైరెక్షనులో కాంగ్రెస్ వారు బి.జె.పి. తో కలసి ఉపసంహరించుకోవటం.( ముఖేష్ అంబానీ పై వచ్చిన F.I.R కారణంగా)

ఇంకో చిన్న విషయం:
 
బి.జె.పి. పార్టీ వారు వారి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టిన మోడీ గారి మీద కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనే ఉద్దేశ్యంతో వారణాసి నుండి ఆమ్ ఆద్మీ అయిన కేజ్రీవాల్ గారు తనే వారణాసి నుండి మోడీ గారిపై పోటీకి దిగారు. ఆయన తన నామినేషన్ కేవలం వారణాసి లో మాత్రమే వేసారు. కానీ ఆయనకు పోటీగా నిలచిన మోడీగారు మటుకు ఓడిపోతానేమోనన్న భయంతో కాబోలు గుజరాత్లోని వేరే నియోజకవర్గం నుంచి కూడా పోటీకి దిగారు. కాని మన ఆమ్ ఆద్మీ అయిన కేజ్రీవాల్ గారు మటుకు ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నియోజక వర్గాల్లో పోటీ చేయటం అనైతికమనే అభిప్రాయంతో ఒకచోటనుండే అంటే వారణాసి నుండే పోటీలో ఉన్నారు. అలాగే బి.జె.పి. వారు, కాంగ్రెస్ వారు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికో Rs.50 నుండి Rs.80 కోట్ల వరకూ ఎన్నికలలో (రాజకీయ పార్టీలు పారిశ్రామిక వర్గాల నుండి అంబానీలనుండి అందిన ఆర్థిక దన్నుతో) ఖర్చు చేస్తుండగా ఆమ్ ఆద్మీ మటుకు తమ వెబ్ సైటు ద్వారా ప్రజల నుండి సేకరించిన విరాళాలతోనే (Rs. 35 కోట్లు) 434 పార్లమెంటు నియోజక వర్గాల్లోనూ ఇంకా కొన్ని అసెంబ్లీ ఎన్నికలలోనూ పోటీ చేస్తూ ఉండటం ఇక్కడ మనమంతా గమనించాల్సి ఉన్న విషయం.

వీరి తరఫున పోటీకి దిగిన వారంతా మీలాంటి నాలాంటి ఆమ్ ఆద్మీలే నన్న విషయం కూడా మనం గుర్తించాల్సి ఉంది.
అందుచేత పై విషయాలనన్నింటినీ మనం పరిగణనలోకి తీసుకొని ఈ సారి కాంగ్రెస్, బి జె పీ లకు బదులుగా మన ఆమ్ ఆద్మీలను గెలిపించుకొనే ప్రయత్నం చేద్దాం. 434 సీట్లలో నిలచిన ఆమ్ ఆద్మీలలో అత్యధికులను గెలిపించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలాన్ని మనము  ఆమ్ ఆద్మీలకు కలిగిద్దాం. జరిగితే మనకందరితీ మంచే జరుగుతుంది, కాని చెడు జరిగే అవకాశం మటుకు లేదు. ఆమ్ ఆద్మీకి మనం ఓటేస్తే అరవింద్ కేజ్రీవాల్కు ఓటేసినట్లు కాదు. మనకి మనమే ఓటేసికున్నట్లు. సురాజ్య స్థాపన దిశగా ఇది మన ముందడుగు. We get what we deserve.  దీనిని గుర్తులో ఉంచుకొని మనం మన ఓట్లనన్నింటినీ మనకే వేసుకొని సురాజ్యాన్ని స్థాపించుకుదాం. రండి ! కదలి రండి! అందరూ ఓట్లేయండి! మన ఆమ్ ఆద్మీలను గెలిపించి తద్వారా మీరే మిమ్మల్ని పరిపాలించుకోండి.  శుభం భూయాత్! జై హింద్!    

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks