కావ్యాలంకార చూడామణి -- సప్తమోల్లాసము -- ఛందః ప్రకరణము
క.
శ్రీ విశ్వేశ్వరునకునై I భావిత విశ్వేశ్వరాంఘ్రిపద్మునకై సం
భావిత పద వాక్య కళాI కోవిదునకై నయగుణ విశేష గుణ నిధునకునై. 1
విన్నకోట పెద్దయ మహాకవి ఎలమంచిలి పంచధారల ప్రాంత దేశపాలకుడైన చాళుక్య రాజు విశ్వేశ్వర భూపతికి ఆశ్రితుడు. ఈ విశ్వేశ్వర భూపతి రాజ రాజ నరేంద్రుని వంశములోని వాడు. కవి తన కావ్యాలంకార చూడామణిని తన ప్రభువుకు అంకితమిస్తూ ప్రతాపరుద్రీయములో వలెనే అన్నిటికిని ప్రభువునే విషయముగాఁ జేసి లక్ష్యములను వ్రాసినాడు. ఈ ఛందో ప్రకరణాన్ని కూడా తన ప్రభువు కొఱకే నని పైన చెప్తున్నాడు.
క.
ధీయుత పింగళనాగ హIలాయుధ జయదేవ ముఖ్యు లగు నార్యులచే
నాయతమై యామ్నాయ పI దాయిత మగు ఛంద మొప్పిదముగ నొనర్తున్. 2
పింగళు డనబడే నాగము, హలాయుధుడు, జయదేవుడు మొదలైన ఆర్యులచే వేదములనుండి విస్తారముగా ఉద్ధరింపబడిన ఛందశ్శాస్త్రమును ఒప్పిదముగా చెబుతానంటున్నాడు.
క.
ఛందో విభ్రమ విధితోఁ I బొంది కదా వేదశాస్త్రములు వాగ్వనితా
మందిరము లైన యయ్యరI వింద భవుని వదనములకు విభవం బొసగెన్. 3
ఛందశ్శాస్త్ర విభ్రమ విభవాన్ని పొందటం వల్లనే కదా వేదశాస్త్రములకు ఆ అరవింద భవుడైన బ్రహ్మ దేవుని నాలుగు వదనములకు వాక్కు అనబడే సరస్వతీ దేవి మందిరములg అనబడే వైభవం కలిగింది !
శా.
పొందై , గౌరవలాఘవప్రకృత మై , పూర్ణాక్షర స్నిగ్ధ మై,
యందం బై , శ్రుతిసమ్మతప్రకట మై , ప్రాపించు నానా విధ
చ్ఛందస్సూత్రము లేక లోకములఁ జంచద్వాక్య రత్నావళీ
సందోహంబులు కంఠభూషణము లై సంధిల్లునే ఏరికిన్ ? 4
పొందు కలిగిన దై, తేలికగా గౌరవాన్ని పొందిన దై, పూర్ణాక్షరములతో స్నిగ్ధమైన సౌందర్యం కలిగి అందమైన దై, వేదములచే సమ్మతింపబడి ప్రకటితమైన దై ప్రాపించే నానా విధములైన ఛందస్సూత్రములు ఒకే లోకములో కదలుచున్న వాక్యములనబడే రత్నాలతో కూడిన సమూహములు ఎవరికైనా కంఠభూషణములుగా ఉంటాయా ?
క.
ఛందము వాఙ్మయ విద్యాI కందము యతిగమక సమకగణవృత్తకృతా
నంద మమందార్థకళాI విందము వాణీకరారవిందము ప్రతిభన్.5
ఛందస్సు విద్యకు అందాన్ని చేకూరుస్తుంది. ప్రతిభలో యతి గమకములతో కూడినదై వృత్తములతో చేయబడిన గొప్ప అర్థాలు కలిగిన కళావిందము , సరస్వతీ దేవి చేతికి అరవిందమై ఒప్పుతుంది.
తరువాత ఈ ఛందశ్సాస్త్ర మెలా ఉత్పన్నమైనదో చెపుతాడు.
మంధర దుర్బోధ : వనం జ్వాలా నరసింహారావు
14 hours ago
4 comments:
మనలో ౧౦౦కి ౯౯ మందికి పనసతోనలను ఎలా తినాలో తెలియదంటే అతిశయోక్తి కాదు.ఎందుకంటే అదో పాకకళ.సరిగ్గా మీ బ్లోగ్లోని అంశము అదే విధంగా ఉన్నది.మాబోటి పాత తరానికి ఇదొక మహాదావకాసం గా భావిస్త్తున్నాను.ధన్యవాదములు -జయదేవ్.చల్లా /చెన్నై-౧౭
పనస ను తేనే +నిమ్మ రసం+ఏలకుల పొడి+కొద్దిగా గొ-ఘ్రుతం కలసిన మిశ్రమంలో 2రోజులపాటు ఉరవేసి .పరగడుపున గాని.రాత్రి భోజనానికి తర్వాత గాని ఒక తోన వంతున తింటే శరీరం వజ్రసమానం గా ఉంటుంది/ముసలితనపు చాయలు మచ్చుకైనా కనిపించవు మరి .సరిగ్గా అలానే ఉంది మీ బ్లాగు లోని సారం -జయదేవ్.చల్లా /చెన్నై-౧౭
నేనూ ఆ తొంభై తొమ్మిది మందిలో వాడినే అని తెలుసుకున్నాను. మీరిచ్చిన సలహాను ఈ సారి పనస తొనలను తినే అవరకాశం కలిగినప్పుడు తప్పక పాటించి చూస్తాను. మీరిచ్చిన ఈ క్రొత్త విషయ పరిజ్ఞానానికి మీకు నా ధన్యవాదాలు. ముసలితనపు ఛాయలనుండి తప్పించుకోవటం నాకు చాలా అవసరం కదా ఇప్పుడు !
చాలా బాగుంది మీ ప్రయత్నం. మీ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను.
Post a Comment