నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label విశ్వనాథ సత్యనారాయణ. Show all posts
Showing posts with label విశ్వనాథ సత్యనారాయణ. Show all posts

Jun 19, 2009

అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం

అవతారిక-2
చ.
తిరుపతి వేంకటేశ్వరులు దేశముఁ గైతయు గ్రుచ్చియెత్త బం
దరు పుర మాంగ్లపుం జదువునం జని వారలలోన వేంకటే

శ్వర గురు రాజమౌళి పదసంజనిత త్రిదివాపగా సుధా

ఝురముల మున్కలాడు ఫలసంగతి సత్కవి నై మెలంగుచున్
. 18
చ.
తన యెదయెల్ల మెత్తన కృతప్రతిపద్యము నంతకంటె మె
త్తన తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి చెప్పలేని మె

త్తన యయి శత్రుపర్వతశతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం

కన గురువంచుఁ జెప్పికొనఁగా నది గొప్ప తెలుంగునాఁడునన్. 19
ఎంత సుతి మెత్తని పద్యం.
శత్రుపర్వతశతారము=పర్వతములవంటి శత్రువులకు వజ్రాయుధము వంటి
మ.
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో

హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి దావ్యోమపే
శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్. 21

ఆయన తన గురువుగారి గొప్పదనాన్ని కీర్తిస్తున్నట్లుగా కనిపించే ఈ పద్యం లో విశ్వనాథ వారు తన గొప్పదనాన్నే ఘనంగా చెప్పుకొన్న తీరు అమోఘం మరియు అద్భుతం. వారి గురువైన చెళ్ళపిళస్వామిగారి కున్నటువంటి మృదుకీర్తి భోగం అల ఆ నన్నయ్య గారికి గాని తిక్కన గారికి గాని లేదంట. ఏమిటంటా అది. తనవంటి లఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి ఆవ్యోమపేశల చాంద్రీమయ మృదుకీర్తి అట. ఈ పెద్దసమాసానికర్థం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
అలఘు=చులుకన కాని
స్వాదురస=ద్రాక్ష
అవతార=దిగుట
ధిషణాహంకార=బుద్ధివలని కలిగిన అహంకారము
సంభార=సర్వపూర్ణత్వము
దోహల=ఉత్సాహము
బ్రాహ్మీమయమూర్తి=సరస్వతీమూర్తి
వ్యోమ=ఆకాశము
పేశల=చక్కనిది
చాంద్రీమృదుకీర్తి=వెన్నెలవంటి మెత్తని కీర్తి
నేను అర్థం చేసుకున్న విధంగా ఈ పద్యానికి అర్థం ఇలా ఉంటుందనుకుంటున్నాను.

చులుకన కాని ద్రాక్షారసంతో కూడిన బుద్ధి అనే అహంకారంతో సర్వసంపూర్ణత్వాన్నికలిగి ఉత్సాహంతోకూడి సాక్షాత్ సరస్వతీ స్వరూపమైన నావంటి శిష్యుని కలిగివుండటం వల్ల పొందగలిగే, ఆకాశాన్ని ప్రకాశింపచేస్తున్నచల్లని వెన్నెలవంటి మృదు కీర్తి అనబడే భోగం మా గురువైన చెళ్ళపిళ స్వామికే కలిగింది కాని ఆనాటి గొప్పకవులైన నన్నయ్యగారికిగాని తిక్కన గారికి గాని కలగలేదు.
ఎంత గొప్పగా తనగొప్పదనాన్ని గురువులమీది భక్తినీ ఏకకాలంలో వ్యక్తం చేసారోకదా. అలా రాయటం కేవలం ఆ మహా మనీషికే చెల్లు.
ఒకపదానికి నిఘంటువులలో అనేకానేక అర్థాలుంటాయి. సందర్భాన్ని బట్టి మనం తీసుకొనే అర్థాన్ని బట్టి మనకు తోచే అర్థం మారుతూ ఉంటుంది. నాకర్థం అయిన భావం పైన వ్రాసాను. పూర్తిగా సరికాకపోవచ్చు. పెద్దలు ఇంకా మంచి అర్థం వివరిస్తే కృతజ్ఞుడనై ఉంటాను.
సీ.
ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన్న శిల్పపుఁ దెనుఁగుతోట
యెఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు
పోతన్న తెలుఁగుల పుణ్య పేటి
శ్రీనాధుఁడు రసప్రసిధ్ధ ధారాధుని
కృష్ణరాయఁ డనన్య కృతిప్రబంధ
పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు
రామకృష్ణుఁడు సురారామగజము
గీ.
ఒకఁడు నాచనసోమన్న, యుక్కివుండు
చెఱిపి పదిసార్లు తిరుగ వ్రాసినను మొక్క
వోని యీ యాంధ్రకవిలోకమూర్ధమణుల
మద్గురుస్థానములుగ నమస్కరించి. 30

తనకు గురువుగా ఉన్న కవుల పేర్లను ఎన్నుకోవడానికి నిజంగానే విశ్వనాథ వారు ఒకటికి పదిసార్లు చెఱిపి తిరిగి తిరిగి వ్రాసికున్నారేమో-- అందుకోసమేనేమో చివరలో ఆమాట కూడా పడింది పద్యంలో.
ఇక సంస్కృత కవుల విషయానికొస్తే
ఆ.
భాసకాళిదాస భవభూతి దిఙ్నాగు
లకుఁ బ్రశస్తవాగ్విలక్షణుంఢు ము
రారిభట్టునకును రామకథాభాష్య
కారులకును మోడ్పు కై ఘటించి. 31
శా.
ఈ సంసార మిదెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భా
షాసంక్రాంతఋణంబుఁ దీర్పఁగలదా ! సత్కావ్యనిర్మాణరే
ఖాసామాగ్రి ఋణంబుఁ దీర్పఁగలదా ? కాకుత్థ్సుఁ డౌ స్వామి గా
థాసంపన్నము భక్తిఁదీర్చినను ద్వైతా ద్వైతమార్గంబులన్.34
గీ.
ఒక్క వాల్మీకి కాక వేఱొక్కఁ డెవఁడు
సుకవిశబ్దవాచ్యుం డిఁక గుకవినింద
యప్రశస్తపథంబుగా నవుటఁ జేసి
మునిఋణముఁ దీర్ప నీ కావ్యమును రచింతు.35

నిజంగానే విశ్వనాథవారు మునిఋణాన్ని తీర్చుకున్నారు. ఆయన ఋణాన్ని మనం తీర్చుకోవాల్సివుంది.
గీ.
నాది వ్యవహారభాష మంథరము శైలి
తత్త్వము రసధ్వనులకుఁ బ్రాధాన్యమిత్తు
రసము పుట్టింపంగ వ్యవహారము నెఱుంగ
జనును లోకమ్ము వీడి రసమ్ములేదు. 38

ఎంత బాగా చెప్పారు.
మ.
తొడవుల్ వృత్తులునున్ గుణంబులును రీతుల్ వ్యంగముల్ దీప్తి యే
ర్పడగాఁ గావ్యత, సంస్కృతంబొలసియాంధ్రంబయ్యె నీ తెల్గుమేల్
నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళును జాతి మాట్లాడు కై
వడి సత్కావ్యము లొప్పునాంధ్రమున, నా రామాయణం బట్టిదే. 39

ఈ పై పద్యమే నాచేత ఈ టపాలను వ్రాయటానికి పురికొల్పింది. తెల్గుమేల్నుడికారమ్ములు దేశ్యముల్ పలుకుబళ్ళును జాతి మాట్లాడు కైవడి-- వీటిని ఏర్చి ఒకచోట కూర్చాలన్నదే నా అశక్తి, ఆరాటమునూ.
సీ.
చిఱునవ్వు నవ్వెనా ! చిన్నారి ముత్యాలు
ప్రోవులు ప్రోవులు పోసినట్లు
కనులెత్తి చూచెనా ? కప్రంపుఁ జిఱుపొడు
లుప్ఫని తీగఁగా నూదినట్లు
ఒక యింత నడచెనా ! యొగి ఢిల్లి భోగాల
రాశి లాభము కొలపోసినట్లు
పన్నెత్తి యాడెనా ! ప్రభుత విస్మృతిపడ్డ
సాధుభావము బారసాచినట్లు
గీ.
మంజులవినీత వేషుఁడు మధురమూర్తి
యార్ద్రభావుఁడు కుదిమట్ట మైన బొమ్మ
బాలరాఘవువలెఁ బితృవాక్యపాల
నా నినీషా మనీషా సనాతనుండు.41

ముక్త్యాల యువరాజుగారి గుఱించి వ్రాసినదీ పద్యం.
ఉ.
ఇచ్చెదనంచు చెప్పు సగమిచ్చును చాలద యద్ది కాన, వే
రిచ్చెడు వానికై వెదకు నిచ్చినదిన్ దినివేయు వీఁడు వే
రిచ్చెడువాఁడు కావలయు నీగతి జీననముద్రణమ్ములన్
ద్రచ్చుకొనున్ దరిద్రుఁడు సరస్వతి నాలుకమీఁద నాడినన్. 62

మండలి వెంకట కృష్ణారావుగారి గుఱించి చెబుతూ ఆయనిలా అంటారు.
గీ.
స్నేహమని లేదు కాని నా స్నేహితులకు
చిన్ననాఁటి స్నేహితులకు స్నేహితుండు
రావు మండలికుల కృష్ణరా వొకండు
ఒగిని మేమందఱము కృష్ణయొడ్డుజాతి !69

కృష్ణవొడ్డు జాతివారి గొప్పదనం గుఱించి కృష్ణాతీరం పుస్తకంలో మల్లాది వారు రాసింది గుర్తుకొస్తోంది. మేం గోదావరి వొడ్డునుండే వాళ్ళం. భారతం మూడూళ్ళు తిరిగితేనే కాని పూర్తికాలేదట. కాని భాగవతం మటుకు పోతన ఒక్కడూ ఒంటి చేతిమీద పూర్తి చెయ్యగలిగాడట. అదట ఆ కృష్ణమ్మ గొప్పదనం.

3 comments

మఱల ని దేల రామాయణం బన్నచో

సీ.
మఱల ని దేల రామాయణం బన్నచో
నీ ప్రపంచక మెల్ల నెల్ల వేళఁ

దినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు

తనరుచి బ్రదుకులు తనవిగాన

చేసిన సంసారమే సేయుచున్నది

తనదైన యనుభూతి తనదిగాన
తలఁచిన రామునే తలఁచెద నేనును
నా భక్తి రచనలు నావిగాన

గీ.
కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందుఁ తొంబదియైన పాళ్ళు

ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథాదృతిని మించి. 5

మళ్ళీ ఈ రామాయణం ఏంటయ్యా అనేవారికి విశ్వనాధ సత్యనారాయణ గారి జవాబు ఈ పై పద్యం. "నా భక్తి రచనలు నావి గాన". ఇదీ ఆయన జవాబు. కావ్యంలోని గొప్పతనం 90 పాళ్ళు కవి ప్రతిభలోనే ఉంటుందట. కథ కంటె కూడా రసము వేయి రెట్లు గొప్పది.
గురువులు భైరవభట్లవారూ, చింతా రామకృష్ణారావుగారు మొదలైన పెద్దవారంతా విశ్వనాథ వారి కల్పవృక్షం గుఱించి ఎంతో అందంగా వారి వారి బ్లాగుల్లో వ్రాస్తూనే వున్నారు కదయ్యా. మళ్ళీ నీవుకూడా ఆవిషయాలే రాస్తానంటున్నా వేమిటి అనే వారికి నా జవాబు "నాదైన యనుభూతి నాదిగాన"అనే. భైరవభట్ల వారు రామాయణ కల్పవృక్షం గుఱించి వారి బ్లాగులో వ్రాసినది చదివినప్పుడూ, విశ్వనాథ వారి సాహిత్యం సంపూర్ణంగా చదివి అర్థం చేసుకోవటానికి ఒక జన్మ పూర్తిగా సరిపోదేమో అని వారన్నప్పుడు నావద్ద శిధిలావస్థలో ఉన్న రామాయణ కల్పవృక్షం పుస్తకాలు గుర్తు కొచ్చినాయి. వాటిని తిరిగి బయటకుతీసి బైండు చేయించే కార్యక్రమం మాత్రం ఈమధ్యనే పూర్తి చేయగలిగాను. బాలకాండ తీసి చదువుతుంటే విశ్వనాథ వారి తెలుగు పలుకుబళ్ళు తెలుగు నానుడుల గురించి బ్లాగ్మిత్రులతో పంచుకోవాలనే ఆరాటం నన్ను నిలవనీయలేదు. అందుచేతనే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించేను. పిన్నలూ పెద్దలూ అందరూ నా యీ చిన్ని ప్రయత్నాన్ని సాదరంగా స్వీకరిస్తారని, ప్రోత్సహిస్తారనిన్నీనా ఆశా ఆకాంక్షాను.

ఇంకావిశ్వనాథవారు రఘురాముని కథ గొప్పదనం గుఱించి ఇలా అంటున్నారు.
ఉ.
పావు నెఱుంగు బ్రహ్మ సగపాలునుమాత్ర మెఱుంగుఁ బార్వతీ
దేవియు నీ వెఱుంగుదువు తెల్లము రామమహత్తు కృత్స్నమా
దేవున కేను నీ యనుమతింపబడి నంకిత మిత్తు జానకీ
దేవి మనోహరుండు రఘుదేవుని సాధుకథా ప్రపంచమున్.
4

రాముని మహత్తు పావు భాగం మాత్రం బ్రహ్మదేవు డెఱుగునట. సగపాలు వరకూ పార్వతీదేవికి తెలియునట. ఆ విశ్వేశ్వరునకు మాత్ర్రం పూర్తిగా తెలియునట. ఆ విశ్వేశ్వరునకు ఆయన అనుమతితో సీతా మనోహరు డైన రఘుదేవుని కథా ప్రపంచాన్ని అంకితం చేస్తున్నానని విశ్వనాథ వారంటారు వారి అవతారికా పద్యాలలో.
ఉ.
వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితివం చనిపించుకో వృధా
యాసముగాక కట్టుకత లైహికమా ? పరమా ? యటంచుఁ దాఁ
జేసిన తండ్రియాజ్ఞ యును జీవుని వేదన రెండు నేకమై ----- 7
వ్రాసానంటారు విశ్వనాథ వారు అవతారికలో.

వారు వారి తండ్రిగారైన శోభనాద్రి గారి గురించి అవతారికలో ఇంకా ఇలా చెప్తున్నారు.
సీ.
నకనకలాడునట్టి కడుపులన్ వచ్చి
త్రేఁచుఁచుఁ బోయెడు తెరువరులును
చినిఁగిన గుడ్డలఁ జనుదెంచి నూతన
పరిధానములఁ దాల్చి యరుగు జనులు
పరిదీనవదను లై యరుదెంచి యుత్సాహ
కృత మందహాసు లై యేగువారు
సందేహ భాజనాస్యములతో వచ్చి యా
శ్చర్య సూచిముఖాలఁ జనెడువారుఁ
తే.
బొలుతు రన్నాతురులు యాచకులును నిత్య
కలిత బహుళ కార్యాంత రాగతులు విశ్వ
నాథ వంశాబ్ధిశశి శోభనాద్రియింట
నిరులు వదలి వెల్తురులు గొం చేగునట్లు. 9
గీ.
సప్త సంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి
ఖిలము గాకుండునది ధాత్రిఁ గృతి యటన్న
నట్టి కృతిశత నిర్మాతనైన బిడ్డఁ
బడసె నా తండ్రి కృతిలోక పారిషదుఁడు. 13

ఇంకా వారు వారి తమ్ముళ్ళ నిద్దరి గుఱించీ ఏమంటున్నారో చూడండి.
ఉ.
తమ్ములు రామచంద్రునకుఁ దమ్ములు నూహ యెఱింగి చేయఁగాఁ
దమ్ములు ధర్మరాజునకుఁ దమ్ములు చెప్పిన యట్లు సేయ నా
తమ్ములు నట్టిరందుఁ జినతమ్ముఁడు సన్మతి రామమూర్తి చి
త్తమ్మున నేను వానికొక దైవముగాఁ గనిపింతు నెంతయున్. 15
ఉ.
పండిత కీర్తనీయుఁ డిరుబాసల దిట్ట రసజ్ఞమౌళి మా
రెండవవాఁడు సన్మతి ధురీణ కవిత్వకళోగ్రకార్తి కే
యుండును వేంకటేశ్వరులహో ! మఱి నా కవనం బిదెల్ల ధీ
శౌండుఁడు తత్పరీక్షఁ బడి సంకున బోసిన తీర్థమై చనున్. 16

శంఖున పోసిన తీర్థం అనే నానుడిని చక్కగా వాడుకున్నారిక్కడ. ఇటువంటి నానుడుల గుఱించి తెలుసుకోవాలనీ, తెలిసింది నలుగురితో పంచుకోవాలనే నా ప్రయత్నం. ఇటువంటి వాటి గురించి తెలుసుకుంటూ మనం కూడా మన సంభాషణల్లో వీటిని వాడటం మొదలు పెడితే మన తెలుగు భాష అజరామరంగా ఎప్పటికీ నిలిచే ఉంటుందనటం లో నా కెంతమాత్రం సందేహం లేదు.
విశ్వనాథవారు వారి గురువుగారి గురించీ అన్యాపదేశంగా నైనా వారిగురించీ చెప్పుకున్న పద్యాలు తరువాత కలసినప్పుడు తెలుసుకుందాం.

3 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks